వేములవాడ,ప్రజనావ: ప్రజల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ పోలీస్ స్టేషన్ల పనితీరు, నేరాల దర్యాప్తు పురోగతి, ప్రజలకు అందిస్తున్న సేవలను నిరంతరం పర్యవేక్షించే క్రమంలో సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే మంగళవారం తంగాళ్లపల్లి పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా స్టేషన్ పరిధిలో నమోదైన కేసులు, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతి, స్టేషన్ రికార్డుల నిర్వహణ, సిబ్బంది హాజరు, పెట్రోలింగ్ విధానం, రౌడీషీటర్లు, పాత నేరస్తులపై నిఘా తదితర అంశాలను క్షుణ్ణంగా సమీక్షించారు. అలాగే ప్రజలకు అందిస్తున్న పోలీసు సేవలపై ప్రత్యేకంగా ఆరా తీశారు.
అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. వివిధ సమస్యలతో పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితుల ఫిర్యాదులను అధికారులు బాధ్యతగా స్వీకరించి, చట్టపరిధిలో సత్వరమే పరిష్కరించాలని సూచించారు. సీసీటీఎన్ఎస్ 2.0 వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించి పోలీసు సేవలను మరింత వేగవంతంగా, పారదర్శకంగా అందించాలని తెలిపారు.
స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది గ్రామాలను తరచూ సందర్శిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి కమ్యూనిటీ పోలీసింగ్ను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.
శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తూ ప్రజల విశ్వాసాన్ని మరింత పెంపొందించేలా సేవలు అందించాలని, విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.ఈ తనిఖీలో ఎస్పీ వెంట డీఎస్పీ నాగేంద్రచారి, సీఐ నాగేశ్వరరావు, ఎస్ఐలు ఉపేందర్ చారి, మల్లేష్ తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

