* వ్యాస పౌర్ణమి సందర్భంగా భక్తులతో కలిసి గిరి ప్రదక్షిణ.. ప్రత్యేక పూజలు నిర్వహించిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్.
కొండగట్టు,:గురు వ్యాస పౌర్ణమి సందర్భంగా జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో నిర్వహించిన గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పాల్గొన్నారు.
తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తున్నప్పటికీ దానిని లెక్కచేయకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు భక్తులతో కలిసి గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. అనంతరం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలని, రైతులు, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆంజనేయ స్వామిని ప్రార్థించినట్లు తెలిపారు.
గిరి ప్రదక్షిణలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి నామస్మరణతో కొండగట్టు క్షేత్రం మార్మోగింది. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా భక్తులు విశేష భక్తిశ్రద్ధలతో గిరి ప్రదక్షిణ పూర్తి చేశారు.

