ప్రజానావ ఉమ్మడి మహబూబ్నగర్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర సాధనకు సిద్ధాంతకర్తగా, ప్రజల ఆకాంక్షలను ప్రపంచానికి చాటిచెప్పి తన యావజ్జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు ఆచార్య ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ అని మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ డి. జానకి కొనియాడారు. గురువారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన జయశంకర్ జయంతి వేడుకల్లో ఆమె పాల్గొని, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఆరు దశాబ్దాల పాటు తెలంగాణ ఆవశ్యకతను దేశవిదేశాల్లో చాటుతూ, ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని నింపిన మహోన్నత వ్యక్తి జయశంకర్ అని అన్నారు. ఆయన జీవితం నేటి యువతకు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. జయశంకర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని పోలీసు సిబ్బంది ప్రజలకు సమర్థవంతమైన, పారదర్శకమైన సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ సురేష్ కుమార్, డీఎస్పీ రమణారెడ్డి, ఏఓ రుక్మిణి భాయ్, ఆర్ఐ అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

