Saturday, August 15, 2026

Buy now

20 నెలల్లో తెలంగాణలో 150 జీసీసీలు..1.5 లక్షల ఉద్యోగాలు: మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్: గత 20 నెలల్లో తెలంగాణలో కొత్తగా “150 గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లు (జీసీసీలు)” ఏర్పాటై, వాటి ద్వారా “1.5 లక్షల మందికి ఉపాధి లభించిందని” రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో జేఎల్‌ఎల్ (JLL) సంస్థ ఏర్పాటు చేసిన గ్లోబల్ కెపబిలిటీ సెంటర్‌ను గురువారం ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులకు అనువైన ప్రాంతాలను గుర్తించి సిఫారసు చేసే సంస్థగా జేఎల్‌ఎల్‌కు ప్రత్యేక గుర్తింపు ఉందని, అలాంటి సంస్థ హైదరాబాద్‌ను తన జీసీసీ కేంద్రంగా ఎంచుకోవడం తెలంగాణ సామర్థ్యానికి నిదర్శనమని అన్నారు. సంప్రదాయ ఐటీ కార్యకలాపాల నుంచి ఇన్నోవేషన్ ఆధారిత జీసీసీల వైపు ప్రపంచం అడుగులు వేస్తోందని, కృత్రిమ మేధ (ఏఐ), ఆటోమేషన్ ప్రభావం పెరుగుతున్నా జీసీసీల ప్రాధాన్యం ఏమాత్రం తగ్గలేదని స్పష్టం చేశారు.

తెలంగాణలో జీసీసీల వేగవంతమైన విస్తరణకు అత్యుత్తమ మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, పరిశ్రమలకు అనుకూలమైన ప్రభుత్వ విధానాలే ప్రధాన కారణమని మంత్రి తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్ తర్వాత రీజినల్ రింగ్ రోడ్, ఏఐ సిటీ, భారత్ ఫ్యూచర్ సిటీ వంటి ప్రాజెక్టులు భవిష్యత్ పెట్టుబడులకు బలమైన పునాది వేస్తున్నాయని పేర్కొన్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఏఐ, డీప్‌టెక్ తదితర రంగాల్లో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు.

మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం, “2024-2026 మధ్య దేశవ్యాప్తంగా జీసీసీల కార్యాలయ లీజింగ్‌లో హైదరాబాద్ వాటా 16 శాతంగా” నమోదైంది. అదే సమయంలో నగరంలోని మొత్తం కార్యాలయ లీజింగ్‌లో “జీసీసీల వాటా 42 శాతానికి” చేరుకోవడం హైదరాబాద్‌కు పెరుగుతున్న ప్రాధాన్యాన్ని సూచిస్తోందన్నారు. ఆరోగ్య సంరక్షణ, బయోటెక్నాలజీ, సెమీకండక్టర్ రంగాలకు చెందిన జీసీసీల ఏర్పాటులో కూడా హైదరాబాద్ తొలి ఎంపికగా నిలుస్తోందని తెలిపారు.

జేఎల్‌ఎల్ ఏర్పాటు చేసిన గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత **వచ్చే రెండేళ్లలో సుమారు 1,600 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది. ఈ కేంద్రం ద్వారా ఫైనాన్స్, మానవ వనరులు, ప్రాజెక్టు నిర్వహణ, లీజ్ అడ్మినిస్ట్రేషన్, అడ్వాన్స్‌డ్ అనలిటిక్స్, టెక్నాలజీ ఆధారిత సేవలను ప్రపంచవ్యాప్తంగా జేఎల్‌ఎల్ కార్యకలాపాలకు అందించనుంది.ఈ కార్యక్రమంలో జేఎల్‌ఎల్ ఇండియా సీఈఓ రాధా ధిర్, హైదరాబాద్ సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ పట్నాయక్, గ్లోబల్ సర్వీస్ సెంటర్ హెడ్ ధీరజ్ పోప్లీ, ఐటీ శాఖ సలహాదారు సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular