హైదరాబాద్: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో నిర్వహించిన రాష్ట్రస్థాయి వేడుకల్లో రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత & జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ చేనేత పురస్కార గ్రహీతలను ఘనంగా సత్కరించిన మంత్రి, ఆగస్టు 7 నుంచి 16 వరకు కొనసాగే 100కు పైగా చేనేత స్టాల్స్తో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదర్శనను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు, వస్త్రం అందించే నేతన్నకు ఒకేసారి ప్రాతినిధ్యం వహించే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. చేనేత కళ భారతీయ సంస్కృతి, సంప్రదాయం, వారసత్వానికి ప్రతీక అని పేర్కొంటూ, గద్వాల, పోచంపల్లి, నారాయణపేట, సిద్దిపేట వంటి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఉత్పత్తులతో తెలంగాణ చేనేత రంగం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.
చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. జియో ట్యాగింగ్, ఐఐహెచ్టీఎస్ (IIHT) శిక్షణ, నేతన్న పొదుపు పథకం, రూ.5 లక్షల ‘నేతన్నకు భద్రత’ బీమా, రూ.49.27 కోట్ల రుణమాఫీ, అలాగే ‘నేతన్న భరోసా’ ద్వారా వార్షిక ఆర్థిక సాయం వంటి సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని వివరించారు.

