Friday, August 14, 2026

Buy now

జిల్లా జనగణన హ్యాండ్‌బుక్‌ను అత్యంత ప్రామాణికంగా రూపొందించాలి

* జనగణన సంచాలకులు భారతి హొళికేరి
* ప్రతి శాఖ అధికారిక నమోదుల ఆధారంగా మాత్రమే సమాచారాన్ని సేకరించాలి
* డేటా నాణ్యత, ఖచ్చితత్వం, ఏకరూపతకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలి
* కాలపట్టికను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లంఘించరాదు
* నిర్ణీత గడువులోపు ధృవీకరించిన జిల్లా జనగణన హ్యాండ్‌బుక్‌ను రాష్ట్ర కార్యాలయానికి పంపాలి
* జిల్లా కలెక్టర్లతో దృశ్యమాధ్యమ సమావేశం నిర్వహించిన జనగణన సంచాలకులు

పెద్దపల్లి : జిల్లా జనగణన హ్యాండ్‌బుక్ (డి.సి.హెచ్‌.బి.) ను అత్యంత ప్రామాణికంగా, నాణ్యతా ప్రమాణాలతో రూపొందించాలని జనగణన సంచాలకులు (డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్) భారతి హొళికేరి జిల్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి జిల్లా జనగణన హ్యాండ్‌బుక్ తయారీపై అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆమె దృశ్యమాధ్యమ సమావేశం నిర్వహించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ పెద్దపల్లి నుంచి అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జనగణన సంచాలకులు భారతి హొళికేరి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా ప్రతి జిల్లాకు ప్రత్యేక జిల్లా జనగణన హ్యాండ్‌బుక్ రూపొందిస్తున్నామని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లకు ప్రత్యేక హ్యాండ్‌బుక్‌లు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా జనగణన హ్యాండ్‌బుక్‌లో జనాభా, సామాజిక, ఆర్థిక, పరిపాలనా, మౌలిక వసతులకు సంబంధించిన సమగ్ర సమాచారం పొందుపరుస్తామని, భవిష్యత్ ప్రభుత్వ విధానాల రూపకల్పన, అభివృద్ధి ప్రణాళికలు, పరిశోధనలు, జనగణన విశ్లేషణలకు ఇది ప్రధాన ఆధార పత్రంగా ఉపయోగపడుతుందని తెలిపారు.

ప్రతి శాఖ నుంచి అన్ని రకాల సమాచారాన్ని సేకరించి, రెవెన్యూ గ్రామం, పట్టణ స్థాయి వరకు పూర్తి వివరాలను నమోదు చేయాలని ఆదేశించారు. 2025 డిసెంబర్ 31 నాటికి అందుబాటులో ఉన్న సౌకర్యాలు, మౌలిక వసతులు, శాఖల సమాచారాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.

గృహాల జాబితా సేకరణ అనంతరం జనాభా గణాంకాలను జాతీయ స్థాయిలో విశ్లేషించి అధికారికంగా ప్రచురిస్తారని తెలిపారు. జిల్లా జనగణన హ్యాండ్‌బుక్‌లో పొందుపరిచే ప్రతి సమాచారం సంబంధిత శాఖల అధికారిక నమోదుల ఆధారంగా మాత్రమే ఉండాలని, సమాచారం సంపూర్ణంగా, ఖచ్చితంగా, ఏకరూపంగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఆగస్టు 10 నుంచి 21 వరకు సమాచార సేకరణ చేపట్టాలని, జిల్లా స్థాయిలో నోడల్ అధికారి ఆధ్వర్యంలో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి, ప్రతి శాఖకు బాధ్యతలు కేటాయించాలని ఆదేశించారు.

శాఖల వారీగా నోడల్ అధికారులను నియమించి, అవసరమైన నమూనా పట్టికలను ముందుగానే అందించాలని, అన్ని శాఖలు ఒకే నిర్ధారిత తేదీని ప్రామాణికంగా తీసుకొని సమాచారాన్ని అందించాలని సూచించారు. అధికారికంగా ధృవీకరించిన పూర్తి సమాచారాన్ని మాత్రమే ఉపయోగించాలని, అన్ని శాఖల్లో గణాంకాల ఏకరూపతను పాటించాలని తెలిపారు. ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 8 వరకు సమాచార నమోదు, పరస్పర పరిశీలన చేపట్టాలని సూచించారు. ప్రతి పట్టికను సంబంధిత శాఖాధికారి, జిల్లా జనగణన హ్యాండ్‌బుక్ విభాగం రెండుసార్లు పరిశీలించాలని, ప్రతికూల విలువలు, ఖాళీ గడులు, పునరావృత నమోదులు లేకుండా చూడాలని, మొత్తాలు, ఉపమొత్తాలు సరిగా ఉండేలా ధృవీకరించాలని తెలిపారు.

గత జనగణన గణాంకాలు, ప్రస్తుత శాఖల సమాచారాన్ని పోల్చి అసాధారణ వ్యత్యాసాలు ఉంటే వాటికి కారణాలు నమోదు చేయాలని సూచించారు. నిర్దేశించిన నమూనా పట్టికలను మాత్రమే ఉపయోగించాలని, టైపింగ్ పొరపాట్లు లేకుండా నమోదు చేయాలని, పదాల అక్షరక్రమంలో ఏకరూపత పాటించాలని, గ్రామాల పేర్లు అధికారిక రెవెన్యూ నమోదుల ప్రకారమే నమోదు చేయాలని, సంకేత సంఖ్యల్లో ఎలాంటి మార్పులు చేయరాదని స్పష్టం చేశారు.

సెప్టెంబర్ 8లోపు జిల్లా సమగ్ర పరిచయాన్ని సిద్ధం చేయాలని తెలిపారు. ఇందులో జిల్లా పరిచయం, భౌగోళిక స్థితి, పరిపాలనా నిర్మాణం, ఆర్థిక కార్యకలాపాలు, సామాజిక పరిస్థితులు, విద్య, ఆరోగ్యం, మౌలిక వసతులు, అభివృద్ధి సూచికలు, జిల్లాకు సంబంధించిన ప్రత్యేక విశేషాలను పొందుపరచాలని సూచించారు. సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 8 వరకు సమాచార ధృవీకరణ నిర్వహించాలని ఆదేశించారు.

ప్రతి పట్టికలో అన్ని గడులు పూర్తిగా నింపబడ్డాయా, మొత్తాలు సరిగా ఉన్నాయా, శాఖల మధ్య గణాంకాల్లో వ్యత్యాసాలున్నాయా, వివరణాత్మక సమాచారం గణాంకాలకు అనుగుణంగా ఉందా, తేదీలు సరిగ్గా నమోదయ్యాయా, అధికారిక ఉత్తర్వుల ఆధారంగా వివరాలు నమోదు చేశారా, పటాల అనుసంధానం సక్రమంగా ఉందా అనే అంశాలను బాధ్యతాధికారులు తప్పనిసరిగా పరిశీలించాలని తెలిపారు.

ప్రతి సమాచారం ప్రామాణికమైనది, ఖచ్చితమైనది, తాజాదైనది, సంపూర్ణమైనది, ఏకరూపమైనది అనే ఐదు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని సూచించారు. ప్రతి దశ పూర్తైన తర్వాత అంతర్గత నాణ్యత తనిఖీ నిర్వహించాలని, ప్రతి సవరణకు సంబంధించిన ఆధార పత్రాలను భద్రపరచాలని, అన్ని అభ్యంతరాలను పరిష్కరించి బాధ్యతాధికారి ధృవీకరణ అనంతరం మాత్రమే జిల్లా జనగణన హ్యాండ్‌బుక్ పార్ట్–ఎను రాష్ట్ర జనగణన కార్యాలయానికి పంపాలని ఆదేశించారు.

జిల్లా అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు మాట్లాడుతూ జనగణన సంచాలకులు ఇచ్చిన అన్ని సూచనలను జిల్లాలో కచ్చితంగా అమలు చేస్తామని తెలిపారు. సంబంధిత శాఖల నుంచి నిర్ణీత నమూనాలో సమాచారం సేకరించి, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పరిశీలించి, నిర్ణీత కాలపట్టిక ప్రకారం జిల్లా జనగణన హ్యాండ్‌బుక్‌కు సంబంధించిన పూర్తి వివరాలను పోర్టల్ ద్వారా రాష్ట్ర జనగణన కార్యాలయానికి గడువులోపు సమర్పిస్తామని తెలిపారు.

ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి జి. శారద, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పవిత్ర, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కాళిందిని, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కల్పన, జిల్లా ఉపాధి అధికారి రాజశేఖర్, జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనాథ్, రోడ్లు–భవనాల శాఖ కార్యనిర్వాహక ఇంజనీర్ భావ్ సింగ్‌ సి సెక్షన్ పర్యవేక్షకులు ధీరజ్ తోపాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular