* బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గజ్జెల దేవరాజ్
సిరిసిల్ల టౌన్: తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి గజ్జెల దేవరాజ్ డిమాండ్ చేశారు.
సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుల రౌండ్ టేబుల్ సమావేశంలో వారు మాట్లాడారు. ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలైన 250 గజాల ఇంటి స్థలం, ఉచిత బస్ పాస్, నెలకు రూ.25 వేల పెన్షన్, ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్య సేవలను తక్షణమే అమలు చేయాలని కోరారు.
ఉద్యమకారుల గుర్తింపు కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీని స్వాగతిస్తున్నామని వారు తెలిపారు. అయితే కేవలం గుర్తింపు ప్రక్రియకే పరిమితం కాకుండా, ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలును కూడా వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.
సెప్టెంబర్ 17లోగా ఉద్యమకారులకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరారు.ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, తెలంగాణ ఉద్యమకారులు తదితరులు పాల్గొన్నారు.

