* జిల్లా పరిశ్రమల మేనేజర్ ఏ. కీర్తి కాంత్
* సకాలంలో చెల్లింపులు, వేగవంతమైన వివాదాల పరిష్కారానికి అవకాశం
* ఎంఎస్ఎంఈలు ప్రభుత్వ నిబంధనలు, సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలి
పెద్దపల్లి : సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు వ్యాపార నిర్వహణను సులభతరం చేయడం, సకాలంలో చెల్లింపులు పొందేలా చేయడం, వ్యాపార వివాదాలను వేగంగా పరిష్కరించడం, పరిశ్రమల అభివృద్ధికి అనుకూల వాతావరణాన్ని కల్పించే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఎంఎస్ఎంఈడీ సవరణ బిల్లు–2026 ను ప్రవేశపెట్టిందని జిల్లా పరిశ్రమల మేనేజర్ ఏ. కీర్తి కాంత్ మంగళవారం తెలిపారు. ఎంఎస్ఎంఈడీ సవరణ బిల్లు 2026 ద్వారా సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలకు పలు ముఖ్యమైన ప్రయోజనాలు కల్పించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. పెట్టుబడి, వార్షిక వ్యాపార లావాదేవీల ఆధారంగా పరిశ్రమల వర్గీకరణతో పాటు, ఉద్యమ్ నమోదు ను ఉచితంగా, స్వచ్ఛందంగా ఆన్లైన్లో చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. కొనుగోలుదారుల నుంచి చెల్లింపులు ఆలస్యం అయినప్పుడు తలెత్తే వివాదాలను ఆన్లైన్ మధ్యవర్తిత్వం, మధ్యవర్తిత్వ తీర్పు ప్రక్రియ ద్వారా వేగంగా పరిష్కరించుకునే అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. దీంతో సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు రావాల్సిన బకాయిలను త్వరగా పొందేందుకు అవకాశం ఏర్పడుతుందని పేర్కొన్నారు.
*ఆలస్యమైన చెల్లింపుల వివాదాలకు వేగవంతమైన పరిష్కారం:
మధ్యవర్తిత్వ తీర్పును రద్దు చేయాలని దాఖలైన కేసు ఆరు నెలలకు మించి పెండింగ్లో ఉన్న సందర్భంలో, తీర్పు ద్వారా నిర్ణయించిన మొత్తంలో కనీసం యాభై శాతం చెల్లించాలని న్యాయస్థానాలు ఆదేశించే అవకాశం ఉంటుందని జిల్లా పరిశ్రమల మేనేజర్ తెలిపారు. అలాగే, మధ్యవర్తిత్వం ద్వారా కుదిరిన రాజీ ఒప్పందాలు, మధ్యవర్తిత్వ తీర్పులను భూ బకాయిల మాదిరిగా వసూలు చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. ఈ చర్యల ద్వారా సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు చెల్లింపుల విషయంలో మరింత భరోసా కలుగుతుందని పేర్కొన్నారు.
*వాణిజ్య బిల్లుల ద్వారా చెల్లింపులకు మరింత వేగం:
సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు సంబంధించిన వాణిజ్య బిల్లుల చెల్లింపులను వేగవంతం చేసి, వాటి నగదు లభ్యతను మెరుగు పరిచేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు వాణిజ్య బిల్లుల ఎలక్ట్రానిక్ రాయితీ వ్యవస్థ ద్వారా చెల్లింపులను నిర్వహించే విధానం ప్రతిపాదించ బడిందని ఏ. కీర్తి కాంత్ తెలిపారు. దీని ద్వారా పరిశ్రమలకు అవసరమైన నిర్వహణ మూలధనం అందుబాటులో ఉండటంతో పాటు, వ్యాపార కార్యకలాపాలను నిరంతరాయంగా కొనసాగించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. సదుపాయ మండళ్ల ద్వారా కేసుల వేగవంతమైన పరిష్కారం ఆలస్యమైన చెల్లింపులకు సంబంధించిన కేసులను వేగంగా పరిష్కరించేందుకు రాష్ట్రాలు ఒకటి కంటే ఎక్కువ సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమల సదుపాయ మండళ్లను ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. చిన్నపాటి నేరాలను క్రిమినల్ కేసులుగా కాకుండా పౌర జరిమానాల ద్వారా పరిష్కరించే విధానం కూడా ప్రతిపాదించబడిందని వివరించారు. పెద్దపల్లి జిల్లాలోని సూక్ష్మ మరియు చిన్న తరహా పరిశ్రమలకు కొనుగోలుదారుల నుంచి చెల్లింపులు ఆలస్యమవుతున్నట్లయితే, సమస్య పరిష్కారం కోసం సూక్ష్మ , చిన్న పరిశ్రమల సదుపాయ మండలి, కరీంనగర్ ను ఆశ్రయించవచ్చని జిల్లా పరిశ్రమల మేనేజర్ ఏ. కీర్తి కాంత్ సూచించారు. సూక్ష్మ, చిన్న పరిశ్రమల యూనిట్లు తమ సంస్థలను ఉద్యమ్ నమోదు ద్వారా నమోదు చేసుకోవడంతో పాటు, ప్రభుత్వం అందిస్తున్న వివిధ సదుపాయాలు, విధానాలు మరియు వివాద పరిష్కార వ్యవస్థలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
*పరిశ్రమల అభివృద్ధికి అనుకూల వాతావరణం:
ఎంఎస్ఎంఈడీ సవరణ బిల్లు–2026 ద్వారా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల నియంత్రణ వ్యవస్థను మరింత సరళీకృతం చేయడం, సకాలంలో చెల్లింపులు అందేలా చూడడం, ఆలస్యమైన చెల్లింపుల వివాదాలను వేగంగా పరిష్కరించడం, నగదు లభ్యతను మెరుగుపరచడం వంటి చర్యలకు ప్రాధాన్యత లభిస్తుందని జిల్లా పరిశ్రమల మేనేజర్ తెలిపారు. పెద్దపల్లి జిల్లాలోని సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని తమ పరిశ్రమలను మరింత అభివృద్ధి చేసుకోవాలని ఆయన సూచించారు. పరిశ్రమల అభివృద్ధి ద్వారా జిల్లాలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు స్థానిక ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని తెలిపారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు సకాలంలో చెల్లింపులు, వేగవంతమైన వివాదాల పరిష్కారం, సులభతరమైన వ్యాపార నిర్వహణకు ఎంఎస్ఎంఈడీ సవరణ బిల్లు–2026 దోహదపడుతుందని, జిల్లా పరిశ్రమల మేనేజర్ పేర్కొన్నారు.

