పెద్దపల్లి: కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని రామగుండం ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పిలుపునిచ్చారు.
పెద్దపల్లిలోని ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు క్యాంప్ కార్యాలయంలో గురువారం పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే విజయరమణ రావుతో కలిసి ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. పార్టీ కోసం కష్టపడుతున్న ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని, ప్రజా సమస్యల పరిష్కారానికి నాయకులు నిరంతరం అందుబాటులో ఉండాలని అన్నారు.
నియోజకవర్గాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించి కాంగ్రెస్ పార్టీపై మరింత విశ్వాసం పెంపొందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ సంస్థాగత బలోపేతం, రాబోయే కార్యక్రమాలపై నాయకులతో విస్తృతంగా చర్చించి పలు సూచనలు చేశారు.
ఈ సమావేశంలో రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, మండల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

