# ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
సిరిసిల్ల: 2018 వేములవాడ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన కోర్టు కేసు కారణంగా ఇంతకాలం సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రత్యేకంగా భద్రపరిచిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎంల)ను గురువారం సర్ధాపూర్లోని ఈవీఎం గోదాంలోకి తరలించారు.
కోర్టు కేసు ముగిసిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి అనుమతులు లభించిన అనంతరం, ఎన్నికల నిబంధనలు, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఈవీఎంల తరలింపు ప్రక్రియను చేపట్టారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఈ ప్రక్రియను పరిశీలించి, ఈవీఎంలను భద్రపరిచే విధానంపై అధికారులకు పలు సూచనలు చేశారు.
2018 వేములవాడ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన కోర్టు కేసు కారణంగా సంబంధిత ఈవీఎంలను ఇంతకాలం సిరిసిల్లలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రత్యేకంగా భద్రపరిచినట్లు కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతుల మేరకు ప్రస్తుతం వాటిని సర్ధాపూర్లోని ఈవీఎం గోదాంలో భద్రపరిచేందుకు తరలించినట్లు పేర్కొన్నారు.
రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో, పటిష్ట పోలీస్ బందోబస్తు మధ్య ఈవీఎంల తరలింపు ప్రక్రియను పూర్తి చేసినట్లు కలెక్టర్ గరిమ అగ్రవాల్ వెల్లడించారు. ఈవీఎంల భద్రత విషయంలో ఎన్నికల నిబంధనలను కచ్చితంగా పాటించాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, సిరిసిల్ల ఆర్డీఓ శ్రీధర్ బాబు, వేములవాడ ఆర్డీఓ కె.ఎస్.బి. కుమారి, తహసీల్దార్లు మహేష్ కుమార్, జయంత్, ఎన్నికల విభాగం నాయబ్ తహసీల్దార్ రెహమాన్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

