# పోలీస్ పరేడ్ మైదానంలో ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష
సిరిసిల్ల: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు చేపడుతున్న ఏర్పాట్లను సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే పరిశీలించారు. సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని పోలీస్ పరేడ్ మైదానంలో ఈ వేడుకలను నిర్వహించనున్నట్లు ఎస్పీ తెలిపారు.
ఈ సందర్భంగా వేడుకలకు సంబంధించిన వేదిక ఏర్పాటు, పరేడ్ నిర్వహణ, వివిధ శాఖల శకటాల ప్రదర్శన, ప్రజాప్రతినిధులు, మీడియా ప్రతినిధులు, అధికారులు కూర్చునే ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్ తదితర అంశాలపై సంబంధిత అధికారులను అడిగి ఎస్పీ వివరాలు తెలుసుకున్నారు.
వేడుకలకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని, కార్యక్రమం సజావుగా జరిగేలా సమన్వయంతో చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.ఎస్పీ వెంట ఎస్బీ డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ రవి, ఆర్ఐలు మధుకర్, సురేష్, తహసీల్దార్ మహేష్ తదితరులు ఉన్నారు.

