* సంబంధిత శాఖల అధికారులు బాధ్యతతో వ్యవహరించాలి: జిల్లా కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు
ములుగు: ప్రజావాణి కార్యక్రమంలో అర్జీదారులు అందించిన దరఖాస్తులకు సత్వర పరిష్కారం అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు అధికారులను ఆదేశించారు.
నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ)లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు, జిల్లా అదనపు కలెక్టర్లు సి.హెచ్. మహేందర్ జీ, ఎం. సంపత్ రావు తో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.
* 44 దరఖాస్తులు స్వీకరణ
ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 44 దరఖాస్తులు అందాయి. వీటిలో భూమికి సంబంధించినవి 15, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినవి 4, పెన్షన్లకు సంబంధించినవి 7, ఇతర శాఖలకు సంబంధించినవి 18 దరఖాస్తులు ఉన్నాయి.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో అందిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులకు పంపించినట్లు తెలిపారు. దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు జవాబుదారీతనంతో వ్యవహరించాలని, దరఖాస్తుదారులకు అవసరమైన పరిష్కారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజావాణికి వచ్చే ప్రతి అర్జీని నిర్లక్ష్యం చేయకుండా నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో డీఆర్ఓ రవి కుమార్, ఆర్డీఓ కృష్ణవేణి, అన్ని శాఖల జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

