* ఇప్పటికీ దళితులపై వివక్షపూరిత ధోరణి ఉండటం అన్యాయం
* తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర నాయకురాలు సురారపు కృష్ణవేణి
హైదరాబాద్, సెప్టెంబర్ 8: అసెంబ్లీ సమావేశాల తొలి రోజునే సభ ఆవరణలో చోటుచేసుకున్న పరిణామాలు జుగుప్సాకరంగా ఉన్నాయని తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర నాయకురాలు సురారపు కృష్ణవేణి ఆవేదన వ్యక్తం చేశారు. బంజారాహిల్స్లోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు.
స్పీకర్ గడ్డం ప్రసాద్ను అవమానించేలా బీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలను తెలంగాణ రక్షణ సేన తీవ్రంగా ఖండిస్తోందని కృష్ణవేణి తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చి 80 ఏళ్లు గడిచినా దళితులు ఎంత ఉన్నత పదవుల్లో ఉన్నప్పటికీ వారిపట్ల వివక్షపూరిత ధోరణి కొనసాగడం అన్యాయమని అన్నారు. స్పీకర్పై చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేతలు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
అదే సమయంలో అసెంబ్లీ ఆవరణలో బీఆర్ఎస్ మహిళా శాసన సభ్యుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు దుర్మార్గంగా ఉందని ఆమె ఆరోపించారు. ఈ ఘటనకు బాధ్యులైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రజా సమస్యలకు వేదికగా సభను మార్చాలి:
ప్రజా సమస్యలపై చర్చించాల్సిన శాసనసభలో అధికార, ప్రతిపక్ష పార్టీలు రాజకీయ వివాదాలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల సభ ఔచిత్యం దెబ్బతింటోందని కృష్ణవేణి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు శాసనసభను సమర్థవంతమైన వేదికగా వినియోగించాలని కోరారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై వివక్ష పూర్తిగా తొలగాలంటే సామాజిక న్యాయ తెలంగాణ సాకారం కావాల్సిన అవసరం ఉందన్నారు. సామాజిక న్యాయ తెలంగాణ సాధన కోసం తమ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంకల్పంతో ముందుకు సాగుతూ పోరాటం చేస్తున్నారని కృష్ణవేణి తెలిపారు.

