* ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ
* విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యం
వెల్గటూరు: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా వెల్గటూరు మండలం పైడిపల్లి ప్రభుత్వ పాఠశాలకు విశాఖ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో 50 బెంచీలను అందజేశారు. పాఠశాలకు బెంచీలు సమకూర్చడం ఆనందంగా ఉందని నిర్వాహకులు తెలిపారు.విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సౌకర్యవంతమైన విద్యా వాతావరణం కూడా ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన మౌలిక వసతులను గుర్తించి, వాటిని సమకూర్చేందుకు తమ వంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
గత 35 ఏళ్లుగా తమ కుటుంబం ప్రజాసేవలో కొనసాగుతోందని, అదే సేవా స్ఫూర్తితో భవిష్యత్తులోనూ ప్రజలకు అండగా నిలుస్తామని అన్నారు. అవసరమైన ప్రాంతాల్లో బోర్వెల్స్ ఏర్పాటు చేయడంతో పాటు విద్యార్థులకు ఉపయోగపడే మరిన్ని సౌకర్యాలను కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు.“మన పిల్లలకు అందించే మెరుగైన విద్య, సౌకర్యాలే వారి భవిష్యత్తుకు బలమైన పునాది” అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాఠశాల ఉపాధ్యాయులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు, విద్యార్థులకు నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.

