ఆదిలాబాద్: OLXలో పియానో విక్రయం పేరుతో రూ.25 వేల మోసానికి పాల్పడిన అంతర్రాష్ట్ర సైబర్ నేరస్థుడిని ఆదిలాబాద్ టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడుకు చెందిన సంజు బాలు అనే నిందితుడిని ప్రత్యేక బృందం అదుపులోకి తీసుకుంది.
పోలీసుల విచారణలో తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో మొత్తం 11 మంది అమాయకులను ఇదే తరహాలో ఆన్లైన్ మోసాలకు గురిచేసినట్లు వెల్లడైంది. నిందితుడిపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు కీలక సూచనలు చేశారు. ఆన్లైన్లో వస్తువులు కొనుగోలు చేసే ముందు విక్రేత వివరాలను పూర్తిగా ధృవీకరించాలని, ముందస్తుగా నగదు చెల్లింపులు చేయొద్దని హెచ్చరించారు. సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 హెల్ప్లైన్కు కాల్ చేయాలని లేదా సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు.
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐపీఎస్ నాయకత్వంలో ఆదిలాబాద్ జిల్లా పోలీసులు సైబర్ నేరాలపై కఠిన చర్యలు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

