* ఇన్స్టాగ్రామ్లో మొబైల్ స్పేర్ పార్ట్స్ పేరుతో భారీ మోసం
ఆదిలాబాద్: ఇన్స్టాగ్రామ్లో మొబైల్ స్పేర్ పార్ట్స్ విక్రయిస్తామని నమ్మించి భారీగా నగదు వసూలు చేస్తున్న అంతర్రాష్ట్ర సైబర్ నేరగాడిని ఆదిలాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇచ్చోడకు చెందిన సమీర్ సయ్యద్ (25) తన మొబైల్ షాప్ కోసం ఛార్జర్లు, డిస్ప్లేలు, ఇతర యాక్సెసరీస్ కొనుగోలు చేసేందుకు ఇన్స్టాగ్రామ్లో వెతుకుతుండగా “Raj Led Mumbai” అనే ఖాతా ద్వారా నిందితుడు పరిచయమయ్యాడు. సరుకులను కొరియర్ ద్వారా పంపిస్తామని నమ్మించి జూలై 25 నుంచి ఆగస్టు 8 మధ్య పలు విడతల్లో రూ.2,18,000 ఆన్లైన్లో చెల్లింపులు చేయించుకున్నాడు. అనంతరం వాట్సాప్లో నకిలీ కొరియర్ రసీదు పంపించి మోసం చేశాడు.
బాధితుడి ఫిర్యాదు మేరకు 1930కు సమాచారం అందడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితుడిని రాజస్థాన్లోని జాలోర్ జిల్లా, సాంచోర్ ప్రాంతానికి చెందిన హరిరామ్ జీ కుమారుడు ప్రకాశ్ కుమార్ (22) గా గుర్తించారు.
పోలీసుల దర్యాప్తులో నిందితుడు ఇదే తరహాలో 19 రాష్ట్రాల్లో సుమారు 140 మంది బాధితులను మోసం చేసి రూ.5,30,33,494 మేరకు సైబర్ మోసానికి పాల్పడినట్లు వెల్లడైంది.నిందితుడి నుంచి రెండు మొబైల్ ఫోన్లు, రూ.1 లక్ష నగదు స్వాధీనం చేసుకున్నారు.
సైబర్ మోసానికి గురైన ప్రజలు వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐపీఎస్ సూచించారు.

