ప్రజానవ బ్యూరో: భూపాలపల్లి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాదివాస్ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల ఫిర్యాదులను స్వీకరించి, వాటి పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా మొత్తం 17 ఫిర్యాదులను స్వీకరించిన ఎస్పీ ప్రతి ఫిర్యాదును శ్రద్ధగా విని, వెంటనే స్పందించారు. సంబంధిత పోలీస్ స్టేషన్ల సీఐలు, ఎస్ఐలతో నేరుగా మాట్లాడి, ఫిర్యాదులపై చట్టబద్ధంగా, వేగంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రజలు ఎలాంటి మధ్యవర్తులు లేదా పైరవీలు ఆశ్రయించకుండా నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని ఎస్పీ సంకీర్త్ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరికీ చట్టబద్ధమైన న్యాయం అందేలా చర్యలు తీసుకుంటామని, ప్రజలకు మరింత చేరువగా ఉండి శాంతిభద్రతల పరిరక్షణ పోలీస్ శాఖ ప్రధాన బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.
ప్రతి సోమవారం నిర్వహించే ప్రజాదివాస్ ద్వారా ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించి, సంబంధిత అధికారుల సమన్వయంతో త్వరితగతిన పరిష్కరిస్తున్నామని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి భూపాలపల్లి జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ స్పష్టం చేశారు.

