◆ 67వ రోజుకు చేరిన తల్పునూర్ గ్రామస్తుల దీక్షలు
◆ 14 కి.మీ దూరంలోని పట్టణాన్ని వదిలి.. 30 కి.మీ నరకయాతన
◆ స్పందించని ప్రజాప్రతినిధులు, అధికారులు
ప్రజానావ ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో : మమ్మల్ని మా పాత జిల్లాలోనే కలపండి.. దూరభారంతో కావడంతో వనపర్తి జిల్లా తల్పునూర్ గ్రామస్తులు ఉద్యమబాట పట్టారు.
తమ గ్రామాన్ని వనపర్తి జిల్లా నుంచి తొలగించి, తిరిగి నాగర్కర్నూల్ జిల్లాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారానికి 67వ రోజుకు చేరుకున్నాయి. విద్య, వైద్యం, రవాణా, వ్యాపార లావాదేవీల నుంచి వ్యవసాయ అవసరాలకు తమకు నాగర్కర్నూల్ పట్టణమే సమీపంలో కేవలం 14 కి.మీ ఉందనీ, వనపర్తి జిల్లా కేంద్రం 30 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో నిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు వాపోతున్నారు. పరిపాలనా సౌలభ్యం పేరుతో తమను ఇబ్బందులకు గురిచేయడం తగదని, తమ గ్రామాన్ని తిరిగి నాగర్కర్నూల్ జిల్లా పరిధిలోకి తీసుకురావాలని స్పష్టం చేస్తున్నారు.
సమస్య పరిష్కారమయ్యే వరకు పోరాటం ఆపేది లేదని దీక్షలో పాల్గొన్న నాయకులు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందించి తమ ఇబ్బందులను తీర్చాలని కోరుతున్నారు.

