సిరిసిల్ల: కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజాపాలన విజయోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా నేతన్న చౌక్ నుంచి అంబేద్కర్ చౌక్ మీదుగా గాంధీ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం నేతన్న విగ్రహానికి, మహాత్మ జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలకు, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి, మహాత్మా గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు సూర దేవరాజ్తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అనంతరం గాంధీ చౌక్ వద్ద కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం 1000 రోజుల పాలనను పురస్కరించుకుని విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పటాకులు పేల్చి, కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ప్రజా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నాయకులు తెలిపారు.

