బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, సభ్యులు
బీసీ కులాలలోని పిచ్చగుంట్ల, బుడబుక్కల, దొమ్మరి, తమ్మల కులాల స్థితిగతులను తెలుసుకునేందుకు తాము ఇక్కడికి వచ్చామని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ తెలిపారు. రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జీ నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, శ్రీమతి రంగు బాలలక్ష్మి బుధవారం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.
అనంతరం ఆలయ చైర్మెన్ గెస్ట్ హౌస్ ఆవరణలో మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సోషియో, ఎకనామిక్ కుల గణన సర్వే నిర్వహించి, అసెంబ్లీ లో బీసీల రిజర్వేషన్ పెంపు బిల్లు ఆమోదించిందని వెల్లడించారు.
తమ కులం పేరు విద్యాలయాలు, ఉద్యోగ స్థలాల్లో పిలుచుకునేందుకు ఇబ్బంది పడుతున్నామని, ప్రత్యామ్నాయ పేరు ఇవ్వాలని పిచ్చగుంట్ల, బుడబుక్కల, దొమ్మరి వారు విజ్ఞప్తులు అందజేశారని వివరించారు. వారి కులాల పేరు మార్పు కోసం ఇప్పటికే ఆయా కులాల ప్రతినిధులతో చర్చించామని తెలిపారు.
విజ్ఞప్తులు అందజేసిన వారి స్థితిగతులు నేరుగా తెలుసుకునేందుకు జిల్లా పర్యటనకు తాము వచ్చామని చైర్మన్ పేర్కొన్నారు. పరిశీలన అనంతరం ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు.
జిల్లాలోని వేములవాడ, సిరిసిల్ల లోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి రాజ మనోహర్ రావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.