◆ హైదరాబాద్ ఘటనకు నిరసనగా వనపర్తిలో ఆందోళన
◆ శాంతియుత నిరసనకారుల అరెస్టు అన్యాయం.. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నారాయణ
ప్రజానావ ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో : హైదరాబాద్లోని తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ నాయకులు దాడి చేయడాన్ని నిరసిస్తూ వనపర్తి జిల్లా కేంద్రంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ముట్టడించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు డి. నారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. రాజకీయాలను ఎదుర్కోలేక భౌతిక దాడులకు దిగడం కాంగ్రెస్ దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. శాంతిభద్రతలను కాపాడటంలో పోలీసులు, ఇంటెలిజెన్స్ వ్యవస్థలు విఫలమయ్యాయని విమర్శించారు.
అనంతరం కాంగ్రెస్ కార్యాలయం వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమ నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేసి టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించడాన్ని తీవ్రంగా ఖండించారు. అధికార పార్టీకి అనుకూలంగా పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, ప్రతిపక్షాలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిరాజు, కల్పన, అలివేల, నక్క మహేష్, కొమ్ము శ్రీనివాసులు, అరవిందు, గంధం ప్రవీణ్, రాజశేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

