* అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి: ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
రామగుండం: త్వరలో జరగనున్న గణపతి ఉత్సవాల సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ అధికారులను ఆదేశించారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఉత్సవాల ఏర్పాట్లపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.
మున్సిపల్ కమిషనర్, అదనపు కలెక్టర్ అరుణ శ్రీ, కార్పొరేషన్ మేయర్ మహంకాళి స్వామితో కలిసి ఎమ్మెల్యే ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు.
శానిటేషన్, రోడ్లు, తాగునీటిపై ప్రత్యేక దృష్టి
గణపతి ఉత్సవాల సందర్భంగా శానిటేషన్, రోడ్లు, వీధి దీపాలు, ట్రాఫిక్ నియంత్రణ, తాగునీరు తదితర మౌలిక సదుపాయాలను ముందస్తుగానే పూర్తి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఉత్సవాల సమయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
మండపాల వద్ద విద్యుత్ భద్రత తప్పనిసరి:
వినాయక మండపాలను విద్యుత్ స్తంభాలకు దూరంగా ఏర్పాటు చేసేలా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని రాజ్ ఠాకూర్ సూచించారు. మండపాల వద్ద విద్యుత్ సరఫరా కారణంగా ప్రమాదాలు జరగకుండా MCBలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.విద్యుత్ భద్రతపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించి, మండపాల వద్ద ప్రమాదాలకు అవకాశం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు.
నిమజ్జనం వరకు సమన్వయంతో ఏర్పాట్లు:
ఉత్సవాల మొదటి రోజు నుంచి నిమజ్జనం వరకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పటిష్టమైన భద్రతా, నిర్వహణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్, మున్సిపల్ అధికారులు, MRO, TSNPDCL, RFCL, NTPC, సింగరేణి అధికారులు, పోలీస్ అధికారులు, గణపతి ఉత్సవ కమిటీ సభ్యులు, విశ్వహిందూ పరిషత్ సభ్యులు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

