హుజూరాబాద్: తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) జెండా పండుగను శనివారం ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ నియోజకవర్గ నాయకుడు బుర్ర నటరాజ్, జాగృతి హుజూరాబాద్ నియోజకవర్గ కన్వీనర్ సంతోష్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు పడాల మనోజ గౌడ్ మాట్లాడుతూ, పార్టీ వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత స్థాపించిన తెలంగాణ రక్షణ సేన ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.
జెండా పండుగల నిర్వహణ ద్వారా పార్టీ సిద్ధాంతాలు, లక్ష్యాలు ప్రజలకు మరింత చేరువవుతాయని పేర్కొన్నారు. అలాగే పార్టీ సిద్ధాంతాలను ప్రతిబింబించే పాంచజన్యం సందేశాన్ని జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు ఏనుగు మల్లారెడ్డి, జిల్లా నాయకులు హరిప్రసాద్, మైనారిటీ నాయకురాలు ఎండి. సల్మా, అంకం శివరాణి, శారదా, జంగ అపర్ణ, హుజూరాబాద్ నాయకులు కోరపల్లి సురేష్, రొంటాల రాజ్కుమార్ తదితరులు పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రక్షణ సేనను గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు.

