* బాధ్యతలు అప్పగించిన కల్వకుంట్ల కవితకు ఎల్లవేళలా రుణపడి ఉంటా
* తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ సలేంద్ర కొమరయ్య యాదవ్
పెద్దపల్లి : పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలకు అనుగుణంగా పెద్దపల్లి నియోజకవర్గంలో పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు అంకితభావంతో పని చేస్తానని టీఆర్ఎస్ పెద్దపల్లి నియోజకవర్గ ఇంఛార్జీ సలేంద్ర కొమర్య యాదవ్ అన్నారు. నూతనంగా ఎన్నికైన సలేంద్ర కొమరయ్య యాదవ్ను టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనంగా సన్మానించాయి. అనంతరం పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పార్టీ విస్తరణకు కృషి చేస్తానని పేర్కొన్నారు. తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తనపై విశ్వాసం ఉంచి పెద్దపల్లి నియోజకవర్గ ఇంచార్జ్గా బాధ్యతలు అప్పగించడం పట్ల ఎల్లవేళలా రుణపడి ఉంటానన్నారు. తనతో పాటు నియమితులైన మిగతా 22 నియోజకవర్గాల ఇంచార్జ్లకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, పార్టీ అభివృద్ధి కోసం అందరం సమిష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత నాయకత్వాన్ని కొనియాడిన సలేంద్ర కుమార్ యాదవ్, సామాజిక న్యాయానికి ఆమె అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. మాటల్లో మాత్రమే కాకుండా ఆచరణలోనూ సామాజిక న్యాయాన్ని అమలు చేస్తున్న నాయకురాలిగా ఆమె నిలిచారని పేర్కొన్నారు. మొదటి నుంచి బీసీ వర్గాల హక్కులు, అభ్యున్నతి కోసం కవిత గారు బలంగా నిలబడుతున్నారని, అందుకు నిదర్శనంగా 23 నియోజకవర్గాల్లో 12 స్థానాలకు బీసీ నాయకులను ఇంచార్జ్లుగా నియమించడం ఆమె బీసీల పట్ల ఉన్న నిబద్ధత, అంకితభావాన్ని స్పష్టంగా చాటుతోందని ఆయన అన్నారు. పార్టీలో అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యత కల్పిస్తూ, సామాజిక న్యాయాన్ని కార్యరూపంలో చూపిస్తున్న కల్వకుంట్ల కవిత నాయకత్వంలో తెలంగాణ రక్షణ సేన మరింత బలోపేతం అవుతుందనే విశ్వాసాన్ని సలేంద్ర కుమార్ యాదవ్ వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు శంకరయ్యగౌడ్, శ్రీనివాస్ ముదిరాజ్, బొంకూరి సుభాష్, కాల్వల తిరుపతి, చిట్టుమల్ల హన్మండ్లు, చిలుక ఆనంద్, గడ్డం వెంకటేష్, ఎంచర్ల స్వామి, పిల్లి శివ, పల్లె శ్రీనివాస్, మేకల శ్రీనివాస్, రాజ్కుమార్యాదవ్, విశ్వతేజు, కల్వల రవీందర్, రాజేందర్ తదితరలు పాల్గొన్నారు.

