ఉమ్మడి మహబూబ్నగర్ బ్యూరో: జిల్లాలోని సీసీ కుంట పోలీస్ స్టేషన్ను ఎస్పీ డి.జానకి ఆకస్మికంగా సందర్శించి, స్టేషన్ పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. స్టేషన్లోని పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతి, రికార్డుల నిర్వహణను సమీక్షించారు. బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా ప్రతి కేసును వేగవంతంగా దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు.
గ్రామాల్లో బీట్ వ్యవస్థను బలోపేతం చేయాలని, పాత నేరస్తులు, రౌడీషీటర్ల కదలికలపై నిఘా ఉంచాలని సూచించారు. అలాగే సైబర్ నేరాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని, స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరిస్తూ పారదర్శక సేవలు అందించాలని ఎస్ఐ ఓబుల్ రెడ్డికి ఎస్పీ దిశానిర్దేశం చేశారు. ఈ తనిఖీల్లో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

