* రూ. 3 కోట్లతో బందంపల్లి మినీ ట్యాంక్ బండ్ పనులు
* నాణ్యతతో కూడిన నిర్మాణం చేపట్టాలి.. తీగల వంతెన కూడా నిర్మిస్తాం
* చెరువు కట్ట అభివృద్ధికి అదనంగా నిధులు తీసుకొస్తాం
* ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు
పెద్దపల్లి : జిల్లా కేంద్రంలోని బందంపల్లి వద్ద ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రూ.3 కోట్లతో నిర్మించబోయే మినీ ట్యాంక్ బండ్ నిర్మాణ పనులను మున్సిపల్ చైర్మన్, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పెద్దపల్లి ప్రజలు ఆహ్లాదకరంగా గడిపేందుకు రూ. 3 కోట్ల నిధులతో బంధంపల్లి చెరువు కట్టను మినీ ట్యాంక్ బండ్ గా నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. మినీ ట్యాంక్ బండ్ పనులు పరిశీలించిన సమయంలో చెరువు కట్ట వద్ద మరింత సుందరంగా ఉండేందుకు తీగల వంతెన కూడా నిర్మాణం చేపడతామని అందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించడం జరిగిందని అన్నారు. మినీ ట్యాంక్ బండ్ పనులను నాణ్యతగా చేపట్టాలని నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా పని చేయాలని గుత్తేదారునికి సూచించడం జరిగిందని పెద్దపల్లి ప్రజలకు రానున్న రోజుల్లోనే మినీ ట్యాంక్ బండ్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. పెద్దపల్లి పట్టణాన్ని దశలవారీగా అభివృద్ధి చేస్తున్నామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ నుగుల్లా మల్లయ్య, మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, స్థానిక కౌన్సిలర్, పురేళ్ళ శైలజా సుధాకర్, సంబంధిత ఇరిగేషన్ అధికారులు, పట్టణ కౌన్సిలర్లు, పలు గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

