* డివిజన్ల వారీగా ప్రజల్లోకి వెళ్తున్న బీజేపీ శ్రేణులు.. సోమరాపు లావణ్య కార్యక్రమానికి రాంచందర్రావు అభినందనలు
రామగుండం,సెప్టెంబర్ 4:కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలపై రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలను చైతన్యపరిచే లక్ష్యంతో బీజేపీ రాష్ట్ర నాయకురాలు సోమరాపు లావణ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ప్రశ్నిస్తున్న రామగుండం’ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నరపురాజు రాంచందర్రావు అభినందనలు తెలిపారు.
గత వారం రోజులుగా బీజేపీ కార్యకర్తలు రామగుండం కార్పొరేషన్ పరిధిలోని వివిధ డివిజన్లలో పర్యటిస్తూ ప్రజలను కలుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, వాటి అమలుపై ప్రజలకు వివరాలు తెలియజేస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా ప్రజలను చైతన్యపరుస్తున్నారు.
రామగుండం పారిశ్రామిక ప్రాంత అభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా చేసుకుని ప్రతి డివిజన్లో ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకుంటూ, ప్రజలతో మమేకమవుతున్నట్లు బీజేపీ నాయకులు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై ప్రజలకు అవగాహన కల్పించడమే ‘ప్రశ్నిస్తున్న రామగుండం’ కార్యక్రమం ఉద్దేశమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నరపురాజు రాంచందర్రావు ఫోన్ ద్వారా సోమరాపు లావణ్యను అభినందించినట్లు తెలిపారు. ప్రజల్లోకి వెళ్లి సమస్యలను తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వ హామీలపై చైతన్యం కల్పిస్తున్న తీరు అభినందనీయమని ఆయన పేర్కొన్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి.
ప్రజల భాగస్వామ్యంతో మరింత విస్తృతంగా..
‘ప్రశ్నిస్తున్న రామగుండం’ కార్యక్రమంలో బీజేపీ శ్రేణులతో పాటు ప్రజలను కూడా భాగస్వాములను చేయాలని రాంచందర్రావు సూచించినట్లు తెలిపారు. కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా నిర్వహిస్తే తాను కూడా హాజరై ప్రజలతో కలిసి కార్యక్రమంలో పాల్గొంటానని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.
రామగుండం పారిశ్రామిక ప్రాంత అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ప్రజల మధ్య ఉంటూ కార్యక్రమాలను కొనసాగిస్తామని బీజేపీ నాయకురాలు సోమరాపు లావణ్య తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, ప్రజల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని ఆమె పేర్కొన్నారు.

