ప్రజానవ,వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ సోమవారం రంగంపేటలోని వరంగల్ భరోసా కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి, అక్కడ బాధితులకు అందుతున్న సేవలను పరిశీలించారు.
ఈ సందర్భంగా భరోసా కేంద్రంలో అందిస్తున్న కౌన్సెలింగ్, న్యాయ సహాయం, వైద్య సేవలు, మానసిక పరామర్శ, పునరావాస చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. కేంద్రానికి వచ్చే ప్రతి బాధితుడిని సానుభూతితో, గౌరవప్రదంగా స్వాగతించి, వారి సమస్యలను పూర్తిగా తెలుసుకుని సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
మహిళలు, చిన్నారులు, ఇతర బాధితులకు ఒకే వేదికపై సమగ్ర సేవలు అందించే భరోసా కేంద్రం సేవలు ప్రజలకు మరింత చేరువ కావాలని సీపీ సూచించారు. ప్రతి కేసును నాణ్యతతో, వేగవంతంగా పరిష్కరించేలా సంబంధిత శాఖల మధ్య సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు.
బాధితుల గోప్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, వారికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ఈ సందర్శనలో క్రైమ్ అదనపు డీసీపీ బాలస్వామి, ఏసీపీ సదయ్య, భరోసా కేంద్రం ఇన్స్పెక్టర్ సువర్ణ, మహిళా పోలీస్ స్టేషన్-1 ఇన్స్పెక్టర్ సూర్యప్రసాద్, భరోసా ఎస్ఐ కిరణ్మయి, కౌన్సెలర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

