రామగుండం:సింగరేణిలో మెడికల్ బోర్డు ఏర్పాటుకు సంబంధించి ఈ నెల 17, 18 తేదీల్లో బోర్డు నిర్వహించాలని యాజమాన్యం నిర్ణయం తీసుకోవడం హెచ్ఎంఎస్–తెలంగాణ రక్షణ సేన గాంధేయ మార్గంలో చేసిన పోరాటానికి లభించిన సంయుక్త విజయమని ఆ సంఘాలు పేర్కొన్నాయి.
నెలల తరబడి మెడికల్ బోర్డు ఏర్పాటు చేయకుండా కాలయాపన చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం చివరకు కార్మికుల ఉద్యమానికి స్పందించి నిర్ణయం తీసుకుందని నాయకులు తెలిపారు. ఈ నిర్ణయం వేలాది మంది సింగరేణి కార్మికుల విజయంగా అభివర్ణించారు.
అనారోగ్య సమస్యలతో మెడికల్ అన్ఫిట్ కోసం వేలాది మంది కార్మికులు దరఖాస్తు చేసుకున్నప్పటికీ, నెలల తరబడి మెడికల్ బోర్డు ఏర్పాటు చేయకపోవడం వల్ల వారు తీవ్ర మనోవేదనకు గురయ్యారని ఆరోపించారు.
కేవలం ఉద్యమాల నేపథ్యంలో మాత్రమే కాకుండా, ప్రతి నెలా క్రమం తప్పకుండా మెడికల్ బోర్డు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అలాగే వారసత్వ ఉద్యోగాలు సింగరేణి కార్మికుల హక్కు అని పేర్కొంటూ, కార్మికులు సూచించిన వారికే వారసత్వ ఉద్యోగాలు కల్పించాలని, మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసిన అర్హులైన కార్మికులందరి దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించాలని కోరారు.

