సిద్దిపేట : పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల భద్రత దృష్ట్యా సిటీ పోలీస్ యాక్ట్ను అమలు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ ఎస్. రష్మీ పెరుమాళ్ తెలిపారు. సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ 7(1)–2016 యాక్ట్, సిటీ పోలీస్ యాక్ట్ 1348 ఫాస్లి మరియు పోలీస్ యాక్ట్–1861లోని సంబంధిత నిబంధనల ప్రకారం జూన్ 22 ఉదయం 6 గంటల నుంచి జూలై 7 ఉదయం 6 గంటల వరకు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయని వెల్లడించారు.డీజే సౌండ్లపై నిషేధం.. ధర్నాలు, ర్యాలీలకు ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు
కమిషనరేట్ పరిధిలో ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని పేర్కొన్నారు. అత్యవసరంగా నిర్వహించాల్సి వచ్చిన సందర్భంలో సంబంధిత ఏసీపీ నుంచి ముందస్తు అనుమతి పొందాలని సూచించారు. అలాగే బంద్ల పేరుతో వ్యాపార సంస్థలు, కార్యాలయాలు మూసివేయాలని ఒత్తిడి చేయడం, బెదిరింపులకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అదేవిధంగా శబ్ద కాలుష్య నియంత్రణ నిబంధనల ప్రకారం జూన్ 22 నుంచి జూలై 7 వరకు కమిషనరేట్ పరిధిలో భారీ శబ్దాలతో కూడిన డీజే సౌండ్ వ్యవస్థల వినియోగంపై నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని తెలిపారు. చిన్నపిల్లలు, వృద్ధులు, రోగులు, విద్యార్థులు ఇబ్బందులకు గురికాకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. మైక్ సెట్ల వినియోగం అవసరమైతే సంబంధిత డివిజన్ ఏసీపీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.
నిబంధనలను ఉల్లంఘించిన వారిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), సిటీ పోలీస్ యాక్ట్–1348 ఫాస్లి, పోలీస్ యాక్ట్–1861లోని సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు.

