10 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా
రూ. 750 కోట్ల విలువైన భూమిని కాపాడుతూ హైడ్రా ఫెన్సింగ్
మేడ్చల్: హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టి హస్మత్పేటలో 10 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడింది. మేడ్చల్ – మల్కాజగిరి జిల్లా బాలానగర్ మండలం హస్మత్ పేటలో శనివారం ఈ భారీ ఆపరేషన్ను హైడ్రా నిర్వహించింది. సర్వే నంబరు 01లో ఉన్న 10 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది.
మార్కెట్లో దీని విలువ రూ. 750 కోట్ల వరకు ఉంటుందని అంచనా. హస్మత్ పేట సర్వే నంబర్ 01 లో మొత్తం 108 ఎకరాలుండగా ఇప్పటికే 98 ఎకరాలు కబ్జాకు గురయింది.ఎవరికి వారు కబ్జాలు చేసి అక్కడ వంద గజాల బిట్టుల మాదిరి అమ్మేయగా.. కొంతమంది ఇళ్లు కట్టుకున్నారు.అక్కడ ఇళ్ళ నిర్మాణాలు జరిగిపోయాయి.
ఇప్పటికే నివాసాలు ఉంటున్న ఇళ్ల జోలికి వెళ్లకుండా హైడ్రా ఈ ఆపరేషన్ను నిర్వహించింది. రెవెన్యూ అధికారుల లేఖ మేరకు హైడ్రా ఈ భూములను కాపాడింది. రెవెన్యూ అధికారుల సమక్షంలో భారీ పోలీసు బందోబస్తు మధ్య హైడ్రా శనివారం 10 ఎకరాలను కాపాడుతూ ఫెన్సింగ్ వేసింది.
* ప్రీకాస్ట్ ఇటుకల ప్రహరీలు వేసి కబ్జాలు
హస్మత్పేట సర్వే నంబరు 01లో మొత్తం 108 ఎకరాలుండగా.. అక్కడ కబ్జాలు కాకుండా మిగిలింది కేవలం 10 ఎకరాలే. ఈ 10 ఎకరాల్లో ప్రీకాస్ట్ ఇటుకలతో కబ్జాదారులు ప్రహరీలు నిర్మించి ఆక్రమణలకు పాల్పడ్డారు. కొన్ని ప్రహరీల్లో చిన్న గదులు నిర్మించారు.
కాంపౌండ్లు నిర్మించి తాత్కాలిక షెడ్డులు వేసి ఆక్రమణలకు పాల్పడిన కబ్జాదారులు.. వారి సొంత మనుషులను పెట్టీ కాపలాకు ఉంచారు. ప్రీకాస్ట్ వాల్స్ తో పాటు తాత్కాలికంగా వేసిన షెడ్డులను హైడ్రా తొలగించింది. వంద గజాలకో ప్లాటు మాదిరి అక్కడ కబ్జాదారులు తెగనమ్మారు.
ఇలా కబ్జాలకు హైడ్రా చెక్ పెట్టింది. ఆక్రమణలను తొలగించి కబ్జాలకు హైడ్రా చెక్ పెట్టింది. పూర్తిగా ఫెన్సింగ్ వేసి మున్ముందు కబ్జాలకు ఆస్కారం లేకుండా ఫెన్సింగ్ వేసింది. ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేసింది.

