జనగామ:తరిగొప్పుల మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)ను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మమేకమైన కలెక్టర్ వారి చదువులు, లక్ష్యాలపై ఆరా తీశారు.విద్యార్థులకు ఇంగ్లీష్, గణితంపై గంటసేపు ప్రత్యేక తరగతి నిర్వహించి, గణిత సమస్యల పరిష్కార మెళకువలు, ఇంగ్లీష్ పఠన నైపుణ్యాలపై అవగాహన కల్పించారు.
ఇంగ్లీష్, గణితంపై పట్టు సాధిస్తే భవిష్యత్లో మెరుగైన అవకాశాలు లభిస్తాయని సూచించారు.విద్యార్థుల అభ్యాస స్థాయిని తెలుసుకునేందుకు ప్రతి 15 రోజులకు ఒకసారి మాక్ టెస్టులు నిర్వహించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. అన్ అకాడమీ సబ్స్క్రిప్షన్, సాంకేతిక ఆధారిత విద్యా వనరులను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు.
వసతి గృహం, భోజనశాలను పరిశీలించిన కలెక్టర్ ఆహార నాణ్యతపై ఆరా తీశారు. ఆహారంలో నాణ్యత లోపాలు, పాలలో నీళ్లు కలపడం వంటి సమస్యలు ఉంటే వెంటనే ఫిర్యాదు చేయాలని విద్యార్థులకు తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహారం విషయంలో నిర్లక్ష్యం ఉండరాదని స్పష్టం చేశారు.ఈ తనిఖీలో విద్యాశాఖ అధికారులు, కేజీబీవీ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

