కరీంనగర్: నగరపాలక సంస్థ 50వ డివిజన్లో రూ.67 లక్షల వ్యయంతో పూర్తయిన సీసీ రోడ్డు సీసీ డ్రైనేజీ పనులను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ, కరీంనగర్ నగర సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రత్యేక చొరవతో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద కరీంనగర్ నగరానికి రూ.840 కోట్ల అభివృద్ధి ప్రతిపాదనలు ఆమోదం పొందినట్లు ఆయన తెలిపారు.
గతంలో స్మార్ట్ సిటీ మిషన్ ద్వారా దాదాపు రూ.1000 కోట్ల విలువైన అభివృద్ధి పనులు నగరంలో అమలైన నేపథ్యంలో, మరోసారి భారీ స్థాయిలో నిధులు మంజూరు కావడం కరీంనగర్ అభివృద్ధికి మరింత ఊతమిచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ నిధులతో మౌలిక వసతుల అభివృద్ధి వేగవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.రూ.840 కోట్ల అర్బన్ ఛాలెంజ్ ఫండ్కు సంబంధించిన డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీ పి ర్ )ను వచ్చే రెండు నెలల్లో సిద్ధం చేసి, తదుపరి అభివృద్ధి పనులను దశలవారీగా అమలు చేయనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, కార్పొరేటర్లు ప్రవీణ్ రావు, బండ రమణారెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు

