హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, సింగరేణి, ఎన్టిపిసి, టిజిఆర్టిసి, ఎన్పిడిసిఎల్, జెన్కో, అల్ట్రాటెక్ తదితర పబ్లిక్ సెక్టార్ సంస్థల్లో పనిచేస్తున్న పద్మశాలి ఉద్యోగుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం (టీపీయూస్) ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఉద్యోగుల సదస్సు ఎల్.బి.నగర్లోని స్వకులశాలి సమాజ భవన్లో ఘనంగా జరిగింది.
టీపీయూస్ రాష్ట్ర కమిటీ సూచనలు, మార్గదర్శకత్వంలో రాష్ట్రంలోని 18 జిల్లా కమిటీల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ చారిత్రాత్మక సదస్సుకు రాష్ట్ర వ్యాప్తంగా 500 మందికి పైగా పద్మశాలి ఉద్యోగులు హాజరయ్యారు. ఈ సదస్సులో ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాల సమీక్ష, పద్మశాలి ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఉద్యోగ, సామాజిక సమస్యలపై విస్తృతంగా చర్చించి, హక్కుల సాధన, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక రూపకల్పన చేశారు.
ఈ సదస్సుకు పెద్దపల్లి జిల్లా నుండి ప్రతినిధులుగా టీపీయూస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి డా. దుబాసి విష్ణుమూర్తి, జిల్లా అధ్యక్షులు కొలిపాక సారయ్య, ప్రధాన కార్యదర్శి పరికిపండ్ల కోటేశం, ఉపాధ్యక్షులు తాటికొండ శంకర్, ప్రచార కార్యదర్శి పెండెం సత్యనారాయణ, జూనియర్ లెక్చరర్ డా. వల్లాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, అన్ని రంగాల్లో పనిచేస్తున్న పద్మశాలి ఉద్యోగులను ఏకతాటిపైకి తీసుకువచ్చి, వారి సమస్యల పరిష్కారానికి, హక్కుల సాధనకు టీపీయూస్ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ఉద్యోగుల ఐక్యతే మన బలమని, రాబోయే రోజుల్లో మరింత ఉధృతంగా కార్యక్రమాలు చేపడతామని వారు ప్రకటించారు.

