జూలై 3 నాటికి
* ప్రతి అర్హ ఓటరికి తప్పనిసరిగా ఎన్యూమరేషన్ ఫారం అందేలా చర్యలు తీసుకోవాలి
* గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, పట్టణాల్లో బిల్ కలెక్టర్లు, వార్డు అధికారులు బీఎల్వోలకు సహకరించాలి
* ప్రతి ఓటరికి రెండు ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వాలి.. ఒకటి రసీదుగా తిరిగి అందజేయాలి
* ప్రగతి నగర్లో ఎస్ఐఆర్ ఓటరు నమోదు ఆన్లైన్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్
పెద్దపల్లి ప్రతినిధి : ఓటరు నమోదు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా జులై 3లోపు ప్రతి అర్హ ఓటరికి ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీని పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం పెద్దపల్లి పట్టణంలోని 4 వ వార్డు ప్రగతి నగర్లో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ఓటరు నమోదు ఆన్లైన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పరిశీలించారు.
ఈ సందర్భంగా నిర్వహిస్తున్న ఫారాల పంపిణీ, ఆన్లైన్ నమోదు ప్రక్రియపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ ఎన్నికల సంఘం నిర్దేశించిన గడువులోపు ప్రతి అర్హ ఓటరికి ఎన్యూమరేషన్ ఫారం అందేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు.
జులై మూడు నాటికి ఫారాల పంపిణీ ప్రక్రియను పూర్తిస్థాయిలో ముగించాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో బీఎల్వోలకు గ్రామ పంచాయతీ కార్యదర్శులు, పట్టణ ప్రాంతాల్లో బిల్ కలెక్టర్లు, వార్డు అధికారులు పూర్తి సహకారం అందిస్తూ ఫారాల పంపిణీని వేగవంతం చేయాలని తెలిపారు. ప్రతి ఓటరికి రెండు ఎన్యూమరేషన్ ఫారాలు అందించాలని, ఒక ఫారాన్ని ఓటరు వివరాలతో నింపించి స్వీకరించగా, మరో ఫారంపై స్వీకరణ ధృవీకరణ చేసి రసీదుగా ఓటరికి తిరిగి అందజేయాలని సూచించారు.
ఈ ప్రక్రియను పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఎస్ఐఆర్ కార్యక్రమంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా ప్రతి ఇంటికి చేరుకొని ప్రతి అర్హ ఓటరికి ఎన్యూమరేషన్ ఫారం అందించేలా అధికారులు, బీఎల్వోలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. ఈ పరిశీలనలో పెద్దపల్లి తహసీల్దార్ రాజయ్య, మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

