విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
850 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు
వనపర్తి జిల్లా ఎస్పీ సునిత రెడ్డి హెచ్చరిక
ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో: రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి బుధవారం జూలై 15న వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలో పర్యటించనున్నారు. అక్కడ నూతనంగా నిర్మించిన ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల భవన ప్రారంభోత్సవానికి ఆయన విచ్చేస్తున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ సునిత రెడ్డి తెలిపారు. మంగళవారం కొత్తకోటలోని బి.పి.ఆర్ గార్డెన్స్లో బందోబస్తుకు వచ్చిన పోలీస్ అధికారులకు, సిబ్బందికి ఆమె దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి పర్యటన అత్యంత ప్రతిష్టాత్మకమైనదని, భద్రతలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని ఎస్పీ స్పష్టం చేశారు. ముఖ్యంగా విధుల్లో ఉన్నప్పుడు పోలీసులు సెల్ఫోన్లు చూస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ట్రాఫిక్, పార్కింగ్, వీఐపీ రూట్లపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. మొత్తం భద్రతను 8 సెక్టార్లుగా విభజించి, ఒక ఎస్పీ, ఒక అడిషనల్ ఎస్పీ, నలుగురు డీఎస్పీలు, 16 మంది సీఐలు, 54 మంది ఎస్సైలతో పాటు మొత్తం 850 మంది సిబ్బందితో పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వీరితో పాటు స్పెషల్ పార్టీలు, బాంబ్ డిస్పోజల్, డాగ్ స్క్వాడ్స్ రంగంలోకి దిగాయన్నారు. ఈ సమావేశంలో ఏఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి, డీఎస్పీలు గిరిబాబు, బాలాజీ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

