ములుగు:ములుగు జిల్లా అభివృద్ధి, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మరియు ప్రగతిని ఒకేచోట ప్రతిబింబించేలా ములుగు గట్టమ్మ వద్ద నిర్మిస్తున్న పైలాన్ పనులను జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్న కలెక్టర్, పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా పైలాన్ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. నిర్మాణ పనుల్లో ఎలాంటి రాజీ పడకుండా నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.
అనంతరం నూతన సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సముదాయం ఆవరణలో కొనసాగుతున్న ల్యాండ్స్కేపింగ్ పనులను కూడా కలెక్టర్ పరిశీలించారు. పచ్చదనానికి ప్రాధాన్యతనిస్తూ విస్తృతంగా మొక్కలు నాటాలని, లాన్ అభివృద్ధి, అలంకరణ మొక్కల ఏర్పాటు, నడక మార్గాల నిర్మాణం, సుందరీకరణ పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టి కార్యాలయ ఆవరణను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని సంబంధిత అధికారులకు సూచించారు.

