నాగోల్: మహిళల భద్రత, సాధికారత లక్ష్యంగా మల్కాజిగిరి పోలీసులు చేపట్టిన ‘మీ సురక్ష – సహచరి’ కార్యక్రమంలో భాగంగా నాగోల్లోని శుభమ్ కన్వెన్షన్లో ఎల్బీ నగర్, ఉప్పల్ జోన్ల స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీ) మహిళలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి,ఐపీఎస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళల భద్రతకు సంబంధించిన వివిధ అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా సైబర్ మోసాలను ఎలా గుర్తించాలి, వాటి నుంచి ఎలా రక్షించుకోవాలి, డ్రగ్స్ వ్యతిరేక ప్రచారం, మహిళలకు అందుబాటులో ఉన్న చట్టపరమైన రక్షణ, అత్యవసర పరిస్థితుల్లో పోలీసు సేవలను ఎలా వినియోగించుకోవాలనే అంశాలపై అధికారులు వివరించారు.
మహిళలు అప్రమత్తంగా ఉండడంతో పాటు ఎలాంటి సమస్య ఎదురైనా వెంటనే పోలీసులను సంప్రదించాలని, సురక్షిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని అధికారులు సూచించారు.

