దేశవ్యాప్తంగా పారాక్వాట్ గడ్డి మందు వినియోగాన్ని కేంద్ర ప్రభుత్వం నిషేధించడాన్ని తెలంగాణ ప్రభుత్వ విప్ డాక్టర్ బల్మూర్ వెంకట్ స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఎన్నో రైతుల ప్రాణాలను బలిగొన్న ఈ హానికరమైన గడ్డి మందుపై కేంద్రం తీసుకున్న నిర్ణయం అభినందనీయమని పేర్కొన్నారు.
గత అసెంబ్లీ సమావేశాల్లో శాసనమండలిలో మాట్లాడిన సందర్భంగా పారాక్వాట్ గడ్డి మందును నిషేధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ మందు కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోయారని, క్షణికావేశంలో విరుగుడు లేని ఈ విషపదార్థాన్ని సేవించి అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని సభ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
అదే సమావేశాల్లో పారాక్వాట్ను నిషేధించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తీర్మానం పంపిందని చెప్పారు. ఇప్పటికే ప్రపంచంలోని 70కి పైగా దేశాలు ఈ రసాయనాన్ని నిషేధించినప్పటికీ, భారతదేశంలో మాత్రం ఇప్పటి వరకు దీని అమ్మకాలు కొనసాగడం ఆందోళనకరమని పేర్కొన్నారు.
ఇటీవలి కాలంలో పారాక్వాట్ దుష్పరిణామాలపై వైద్యులు, వ్యవసాయ నిపుణులు వ్యక్తం చేసిన ఆందోళనలు, రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం చివరకు ఈ గడ్డి మందును నిషేధించడం సంతోషకరమని డాక్టర్ బల్మూర్ వెంకట్ తెలిపారు. ఈ నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

