మెదక్ : జిల్లా పోలీస్ కార్యాలయంలో కోర్టు–పోలీసు శాఖల సమన్వయ సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ, జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ మాట్లాడుతూ, “నిందితులకు శిక్ష పడినప్పుడే బాధితులకు నిజమైన న్యాయం చేసిన వారమవుతాం” అని అన్నారు. నాణ్యమైన దర్యాప్తు, శాస్త్రీయ సాక్ష్యాల సేకరణ, సమర్థవంతమైన ప్రాసిక్యూషన్, కోర్టు–పోలీసు శాఖల మధ్య సమన్వయంతో బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ, బాధితులకు న్యాయం అందించడమే జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యమని తెలిపారు. కేసుల దర్యాప్తును నాణ్యతతో పూర్తి చేసి, నిందితులకు శిక్ష పడేలా పోలీసులు, ప్రాసిక్యూషన్ అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని అన్నారు.
సమావేశంలో దర్యాప్తు నాణ్యత, సాక్ష్యాల సేకరణ, కేసుల విచారణ వేగవంతం, కోర్టు–పోలీసు శాఖల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరంపై చర్చించారు.

