Friday, September 4, 2026

Buy now

శ్రీ స్వరసిద్ధి వేంకటేశ్వరునికి శ్రీదేవి నాట్యాలయ కూచిపూడి–భరతనాట్య నివేదన

అన్నమయ్యపురం: పద్మ శ్రీ డా. శోభారాజు ఆధ్వర్యంలో ప్రతి శనివారం అన్నమయ్యపురంలో నిర్వహిస్తున్న అన్నదానం–అన్నమ స్వరార్చన కార్యక్రమంలో భాగంగా ఈ శనివారం శ్రీదేవి నాట్యాలయ ఆధ్వర్యంలో కూచిపూడి, భరతనాట్య నృత్యార్చన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

గురువు శ్రీదేవి అరుణ్ కుమార్ మార్గదర్శకత్వంలో జరిగిన ఈ కార్యక్రమం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, శ్రీ అన్నమయ్య అష్టోత్తరం, గురు స్తుతితో ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రారంభమైంది.

అనంతరం శ్రీదేవి నాట్యాలయ శిష్యులు కూచిపూడి, భరతనాట్య నృత్యాలతో శ్రీ స్వరసిద్ధి వేంకటేశ్వర స్వామివారికి నృత్య కైంకర్యం సమర్పించారు. “కృష్ణం కలయ సఖి”, “సతులారా చూడరే”, “తిరు తిరు జవరాల”, “కల్యాణ రామ”, “తాండవ గణపతి”, “మూషిక వాహన”, “అలరిపు”, “డోలాయాంచల”, “గరుడ గమన”, “పుష్పాంజలి”, “నారాయణతే”, “జనుత శబ్దం” తదితర భక్తిరసభరితమైన సంకీర్తనలు, నృత్యరూపకాలను కళాకారులు లయ, తాళం, భావాభినయ సమన్వయంతో ప్రదర్శించారు.

కూచిపూడి, భరతనాట్యంలోని సొగసైన నృత్య కదలికలు, హస్తముద్రలు, భావాభినయంతో అన్నమయ్య సంకీర్తనల్లోని భక్తితత్వాన్ని కళాకారులు చక్కగా ఆవిష్కరించడంతో కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

ఈ సందర్భంగా అన్నమాచార్య భావనా వాహిని అధ్యక్షులు పద్మశ్రీ డా. శోభారాజు, సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా. నందకుమార్ సంయుక్తంగా కళాకారులను అభినందించారు. వారికి శ్రీ స్వరసిద్ధి వేంకటేశ్వర స్వామివారి ప్రతిమను బహుకరించారు. అన్నమయ్య సంకీర్తనలను నృత్యరూపంలో భక్తులకు చేరువ చేస్తున్న శ్రీదేవి నాట్యాలయ గురువు శ్రీదేవి అరుణ్ కుమార్ కృషిని ప్రశంసించారు.

కార్యక్రమం ముగింపులో శ్రీ స్వరసిద్ధి వేంకటేశ్వర స్వామివారికి అంగనలీరే మంగళహారతి సమర్పించి, భక్తులకు ప్రసాద వితరణ చేశారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ నృత్యార్చన కార్యక్రమం ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచింది.

Related Articles

spot_img

Most Popular