* పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి : అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని, ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి అర్జీలను పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అదనపు కలెక్టర్ బి శ్రీరాముల తో కలిసి కలెక్టరేట్ సమావేశం మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు.
ఎలిగేడు మండలం కేంద్రానికి చెందిన రాజవ్వ తన ఇద్దరు కుమారులు తనను పోషించడం లేదని తన సంరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా జిల్లా సంక్షేమ అధికారిక రాస్తూ సీనియర్ సిటిజన్స్ చట్టం ప్రకారం దరఖాస్తు ఫార్వర్డ్ చేసి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
పెద్దపల్లి పట్టణానికి చెందిన బి రజిత తను ఒకేషనల్ ఏఎన్ఎం పూర్తి చేశానని తనకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న ఏఎన్ఎం పోస్టు ఔట్ సోర్సింగ్ ద్వారా ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా సొసైటీకి రాస్తూ అవకాశం మేరకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
కాల్వ శ్రీరాంపూర్ మండలం మీర్జాంపేట గ్రామానికి చెందిన పుల్లూరు పద్మ తనకు వచ్చే ఒంటరి మహిళల పెన్షన్ నిలిపివేశారని తనకు ఒంటరి మహిళ పెన్షన్ మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా డిఆర్డిఓ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
మంథని మండలం పుట్టపాక గ్రామానికి చెందిన జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా తనకు చెందిన 46 గంటల భూమి పోతుందని, కానీ 47 గుంటలు పోతున్నట్లు రికార్డులలో తప్పుగా నమోదు చేశారని, దీనిని సవరించి తన గుంట భూమి తనకు ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా తహసిల్దార్ కు రాస్తూ అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

