* దద్దరిల్లిన లక్ష్మీనగర్.. ప్రజా పాలన నినాదాలతో మార్మోగిన రామగుండం
రామగుండం: కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన వెయ్యి రోజుల ప్రజాపాలనను పురస్కరించుకుని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెయ్యి మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. గోదావరిఖని ప్రధాన చౌరస్తా నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ లక్ష్మీనగర్ వీధుల గుండా కొనసాగుతూ ఎఫ్సీఐ రోడ్ వరకు సాగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాగూర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. రాబోయే రెండు సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర రూపురేఖలను మరింతగా మార్చడంతో పాటు, అన్ని రంగాల్లో తెలంగాణను అగ్రగామిగా నిలబెడతామని ధీమా వ్యక్తం చేశారు.
భారీ సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొనడంతో ర్యాలీ ఉత్సాహభరితంగా సాగింది. “కాంగ్రెస్ ప్రజా పాలన” నినాదాలతో రామగుండం కార్పొరేషన్ పరిధి మార్మోగింది. ముఖ్యంగా లక్ష్మీనగర్ ప్రాంతం ర్యాలీతో సందడిగా మారింది.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

