◆ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్పై చిన్నారెడ్డి వ్యాఖ్యలు
◆ చిన్నారెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డ వనపర్తి ఎమ్మెల్యే.. మేఘా రెడ్డి
◆ చిన్నారెడ్డి వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాల్సిందే: ఎమ్మెల్యే మేఘారెడ్డి ఆగ్రహం
◆ టీపీసీసీ అధ్యక్షుడికి వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఫిర్యాదు!
◆ చిన్నారెడ్డి వ్యాఖ్యలపై టీపీసీసీ సీరియస్.. సమగ్ర విచారణ చేపడతామన్న మహేష్ కుమార్ గౌడ్
ప్రజానావ ఉమ్మడి మహబూబ్నగర్ బ్యూరో : కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు జి. చిన్నారెడ్డిపై తక్షణమే క్రమశిక్షణాపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి హైదరాబాద్లోని గాంధీ భవన్లో టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్కు ఫిర్యాదు చేశారు. వనపర్తి జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులతో కలిసి వెళ్లిన మేఘారెడ్డి, కాంగ్రెస్ పార్టీ తమకు కన్నతల్లి వంటిదని, పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా చిన్నారెడ్డి మాట్లాడటం తీవ్ర అభ్యంతరకరమని పేర్కొన్నారు.
పార్టీ డబ్బులకు అమ్ముడుపోయిందంటూ విమర్శలు చేయడం కార్యకర్తల మనోభావాలను దెబ్బతీస్తుందని, ఇలాంటి చర్యలు పార్టీ క్రమశిక్షణకు విరుద్ధమని స్పష్టం చేశారు. ఈ ఫిర్యాదుపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సానుకూలంగా స్పందిస్తూ, చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపారు. సమగ్ర విచారణ చేపట్టి, అధిష్టానంతో చర్చించిన అనంతరం అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

