Sunday, September 6, 2026

Buy now

పేదల పథకాలను నిర్వీర్యం చేసే కుట్రను ప్రభుత్వం విరమించుకోవాలి

* కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలి*
* మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి

పెద్దపల్లి : తెలంగాణలో పేద, మధ్యతరగతి కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసాగా నిలిచిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రద్దు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రారంభించారని తెలిపారు.

పేద కుటుంబాల్లో ఆడపిల్లల వివాహం తల్లిదండ్రులకు ఆర్థికభారం కాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ పథకాలను అమలు చేశారని పేర్కొన్నారు. 2014లో ప్రారంభమైన ఈ పథకాల కింద మొదట రూ.51,000 ఆర్థిక సహాయం అందించగా, అనంతరం దానిని రూ.75,116కు, ఆ తర్వాత రూ.1,00,116కు పెంచినట్లు తెలిపారు. ఈ పథకాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ఎంతోమంది ఆడబిడ్డల వివాహాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించిందన్నారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, లబ్ధిదారులకు సకాలంలో ఆర్థిక సహాయం అందక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పేద కుటుంబాల్లో ఆడపిల్లల వివాహాలకు ప్రభుత్వం అందించే సహాయం ఆలస్యం కావడం వల్ల కుటుంబాలపై అదనపు ఆర్థిక భారం పడుతోందన్నారు.

పెండింగ్‌లో ఉన్న కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని, అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ఆర్థిక సహాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. వివాహం జరిగిన తర్వాత కూడా నెలల తరబడి పథకం డబ్బుల కోసం ఎదురుచూస్తున్న కుటుంబాల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలనీ కోరారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పేదల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చి ఈ పథకాలను అమలు చేశామని, కాంగ్రెస్ ప్రభుత్వంకూడా రాజకీయాలకు అతీతంగా పేద ఆడబిడ్డల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పథకాలను నిరంతరాయంగా కొనసాగించాలని కోరారు.

జిల్లాలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కింద పెండింగ్‌లో ఉన్న అన్ని దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కోరారు. పేద ఆడబిడ్డల వివాహాలకు భరోసాగా నిలిచిన ఈ పథకాలను నిర్వీర్యం చేస్తే బిఆర్ఎస్ ఆధ్వర్యంలో మరింత పెద్ద ఎత్తున ప్రజాఉద్యమం చేపడతామని హెచ్చరించారు. అనంతరం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగిస్తూ అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సహాయం అందించాలని కోరుతూ పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌ కోయ శ్రీహర్షకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ tsts చైర్మన్ రాకేష్ ,జిల్లా గ్రంథాలసంస్థ మాజీ చైర్మన్ రఘువీర్ సింగ్, BRS నాయకులు మరియు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular