* రంగంలోకి కలెక్టర్, ఎస్పీ సంగ్రామ్ సింగ్
* కర్ణాటక ముఠా పనేనని అనుమానం
ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో: మండలంలోని మహదేవునిపేట గ్రామంలో భారీగా నిల్వ ఉంచిన 111 బస్తాల నకిలీ డీఏపీ ఎరువులను వ్యవసాయ, పోలీస్ అధికారులు ఆకస్మిక తనిఖీల్లో స్వాధీనం చేసుకున్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ గురువారం సంఘటనా స్థలాన్ని స్వయంగా పరిశీలించారు. కర్ణాటకకు చెందిన కొందరు వ్యక్తులు మార్కెట్ ధర కంటే తక్కువగా బస్తా రూ.16-1700లకే విక్రయించడంతో స్థానిక ఏడుగురు రైతులు వీటిని కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న బస్తాల నుంచి నమూనాలను సేకరించి వెంటనే హైదరాబాద్లోని ల్యాబ్కు పంపాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ వ్యవహారంపై ఎస్పీ మాట్లాడుతూ.. రైతులను మోసం చేసే నకిలీ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని, లైసెన్స్ ఉన్న డీలర్ల వద్దే బిల్లులతో ఎరువులు కొనాలని సూచించారు. తనిఖీల్లో డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ అశోక్ రెడ్డి, ఎస్ఐ షంషద్దీన్, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.

