ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో: రైస్మిల్లు డ్రైవర్లు, హమాలీలకు ఉపాధి భద్రత కల్పిస్తూ సమగ్ర చట్టం చేయాలని, వెంటనే సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రగతిశీల రైస్ మిల్ డ్రైవర్స్ & హమాలీ వర్కర్స్ యూనియన్. జిల్లా ప్రధాన కార్యదర్శి పి.అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. శనివారం పెబ్బేరులోని పలు రైస్మిల్లుల్లో యూనియన్ ఆధ్వర్యంలో కరపత్రాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాత్రింబవళ్లు శ్రమిస్తున్న కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలన్నారు. మిల్లుల్లో పనిచేసే కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ, బోనస్ వంటి చట్టాలు అమలు కాకపోవడం విచారకరమన్నారు. ప్రమాదవశాత్తు మరణించిన కార్మిక కుటుంబాలకు రూ.10 లక్షలు, సహజ మరణానికి రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని, నెలకు రూ.9వేల కనీస పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నెల 25న వనపర్తి జిల్లా కేంద్రంలో చేపట్టే ధర్నాను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర నాయకులు నంబి శ్రీను, పెబ్బేరు అధ్యక్షుడు వడ్ల శ్రీను, అఫ్సర్, శేఖర్ రెడ్డి, దేవన్న తదితరులు పాల్గొన్నారు.

