ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో: జిల్లా భద్రతా వ్యవస్థలో స్పెషల్ బ్రాంచ్ విభాగం కీలక పాత్ర పోషిస్తోందని, నేర నియంత్రణకు ఈ సమాచారమే బలమైన కవచమని జిల్లా ఎస్పీ సునిత రెడ్డి అన్నారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో స్పెషల్ బ్రాంచ్ అధికారులు, సిబ్బందితో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయి సమాచార సేకరణతో నేరాలను ముందుగానే అడ్డుకోవడం సాధ్యమవుతుందన్నారు. పాస్పోర్ట్, ఉద్యోగ వెరిఫికేషన్లు, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ల జారీలో పారదర్శకతతో వేగవంతమైన సేవలు అందించాలని సూచించారు. సమన్వయం, క్రమశిక్షణతో పనిచేసి పోలీసు శాఖపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, ఎస్సైలు మంజునాథ్ రెడ్డి, నరేష్, పర్వతాలు, సిబ్బంది పాల్గొన్నారు.

