ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో: జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్ ఐపీఎస్ గురువారం నాగర్కర్నూల్ సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయాన్ని వార్షిక తనిఖీల్లో భాగంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. అనంతరం కార్యాలయ ఆవరణను పరిశీలించిన ఎస్పీ, పోలీస్ స్టేషన్ పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. కార్యాలయానికి వచ్చే బాధితులకు ప్రశాంతమైన వాతావరణం కల్పించాలని, వారి ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, పారదర్శక విచారణ ద్వారా సత్వర న్యాయం అందించాలని అధికారులను సూచించారు. సబ్ డివిజన్ పరిధిలో పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకుంటూ, ఎలాంటి కేసులు పెండింగ్లో ఉండకుండా తగిన చర్యలు తీసుకోవాలని డి.ఎస్.పి ని ఆదేశించారు. కార్యాలయ నిర్వహణ, రికార్డుల భద్రత, సిబ్బంది క్రమశిక్షణ పట్ల ఎస్పీ సంతృప్తి వ్యక్తం చేస్తూ అభినందించారు.
ఈ కార్యక్రమంలో నాగర్కర్నూల్ డీఎస్పీ శ్రీనివాస్, సీఐలు అశోక్ రెడ్డి, శంకర్ నాయక్, సబ్ డివిజన్ పరిధిలోని ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

