◆ అక్కడే జాతీయ జెండా ఆవిష్కరించిన సర్పంచ్!
ప్రజానావ ఉమ్మడి మహబూబ్నగర్ బ్యూరో : స్వాతంత్య్ర వేడుకల వేళ ఆ గ్రామంలో దేశభక్తి ఘనంగానే చాటారు.. కానీ, ఆ దృశ్యం చూసిన ప్రతి ఒక్కరి హృదయం ద్రవించిపోయింది. మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలం పల్లెమోని కాలనీ 2017లో నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడింది. నాటి నుంచి నేటి వరకు సొంత భవనం లేక అద్దె ఇంట్లోనే పాలన సాగించగా, అది కూడా శిథిలావస్థకు చేరింది. దీంతో వేరే దారి లేక సర్పంచ్ శ్రీనివాస్ యాదవ్ తన సొంత పొలంలో ఓ చిన్న ‘రెడీమేడ్ కంటైనర్’ ఏర్పాటు చేసి అక్కడి నుంచే గ్రామాభివృద్ధి పనులు చూస్తున్నారు. శనివారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు ఆ కంటైనర్ ముందే జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం సమర్పించారు. ఏళ్లు గడుస్తున్నా తమ గ్రామానికి భవనం లేకపోవడంపై గ్రామస్తులు తీవ్ర వేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి పల్లెమోని కాలనీ పంచాయతీ భవనానికి తక్షణమే నిధులు మంజూరు చేయాలని సర్పంచ్, గ్రామస్థులు కోరుతున్నారు.

